తొట్టంబేడు, ఆంధ్రప్రభ: తొట్టంబేడు మండలం సీఆర్ఎన్ కండ్రిగలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పర్యటించారు. సీసీఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన శాప్ మాజీ చైర్మన్, దివంగత పీఆర్ మోహన్ కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరై నూతన వధూవరులు డింపుల్, రాజేష్లను ఆశీర్వదించారు. ముందుగా తొట్టంబేడు మండలం సీఆర్ఎన్ కండ్రిగలోని ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు సీసీఎన్ కన్వెన్షన్ హాల్కు చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డితో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, తుడా చైర్మన్ దివాకర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి నగర సంస్థ కమిషనర్ జయకృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ సాయి, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్వర్మతో పాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు