వేలాది ఎకరాలు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు లాక్ కాలనీలకు కాలనీలు ‘నిషేధ’ జాబితాలో అవసరానికి అమ్ముకోలేక స్థానిక జనం విలవిల రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఆలయ, వక్ఫ్ భూముల సమాచారం పూర్తిగా గాయబ్ నిజామాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / బోధన్ : 22ఏ నిషేధిత జాబితాలో ఉమ్మడి నిజామాబాద్ సైతం చిక్కుకొని విలవిలలాడుతున్నది. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో ఈ సమస్య వెలుగు చూస్తున్నది. వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం, దాన్ని రహస్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతి చిన్న కార్యక్రమానికీ గ్రామాల్లో డప్పు చాటింపుతో అవగాహన కల్పించే యంత్రాంగం.. కీలక విషయాన్ని ఎందుకు గుట్టుగా వెబ్సైట్లో పెట్టేసి చేతులు దులుపుకొన్నదో అర్థం కావడం లేదు. చాలా మందికి తమ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయనే విషయం తెలియదు. అవసరాలకు తమ భూములను అమ్ముకోవడానికి సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లినప్పుడే అసలు విషయం బయటపడుతున్నది. తమ భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయో తెలియక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. బోధన్ పట్టణంలోని వేంకటేశ్వరనగర్, శక్కర్నగర్, ఆచన్పల్లి, రాకాసిపేట్, బెల్లాల్ రోడ్డులోని అనేక కాలనీల్లో వందలాది ఇండ్ల స్థలాలు, ఇండ్లను 22ఏ పరిధిలోకి తెచ్చారు. పట్టణంలోని పాండు తర్ఫా, బెల్లాల్ తర్ఫా, దౌత్యాల్ తర్ఫా పరిధిలోని అనేక కాలనీలు, ఇండ్ల స్థలాలు నిషేధిత జాబితాలో చేరాయని తెలిసి పట్టణ ప్రజలు హతాశులవుతున్నారు. జాబితా నుంచి తొలగించాలంటూ బోధన్ ప్రాంతంలోని యజమానులు అధికారులను ప్రాధేయపడుతూ తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. బోధన్ పట్టణం, చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాల పరిధిలో సుమారు 3,500 ఎకరాల భూములు 22ఏలో ఉన్నట్టు సమాచారం. బోధన్ పట్టణంలోని బెల్లాల్ రెడ్డులో 258 ఇండ్లు, ఇండ్ల స్థలాలు కలిగిన పోలీస్ కాలనీ యావత్తు 22ఏలో ఉండటం విస్తుగొలుపుతున్నది. 2000 సంవత్సరంలో ఈ కాలనీ భూమిని నిజాం షుగర్స్ నుంచి పోలీస్ హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ కొనుగోలు చేసింది. 4510/2000 నంబర్తో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ భూముల టైటిల్ ఇంత క్లియర్గా ఉండగా, ఈ కాలనీ మొత్తాన్ని 22ఏలో చేర్చడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఏ సాంకేతిక ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం తమ కాలనీని నిషేధిత జాబితాలో ఉంచిందంటూ ప్రశ్నిస్తున్నారు. బోధన్ పట్టణంలోని వేంకటేశ్వరనగర్ కాలనీ సైతం నిషేధిత భూముల పరిధిలో చూపించడం రాష్ట్ర ప్రభుత్వ అవివేక చర్యలకు నిదర్శనంగా నిలుస్తున్నది. 296 సర్వే నంబర్లో ఉన్న ఈ కాలనీలో సుమారు 400 ఇండ్లు, ఇండ్ల స్థలాలున్నాయి. చాలామంది ఇండ్లు, స్థలాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిసి కాలనీవాసులు లబోదిబోమంటూ అధికారులవద్దకు పరుగులుపెడుతున్నారు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 22ఏ(1)(సీ) ని అనుసరించి దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాలను పొందుపర్చాలి. కానీ వీటికి సంబంధించిన సమాచారమే దొరుకడం లేదు. నిజామాబాద్ జిల్లాలో అనేక ఆలయాలకు రూ.కోట్లు విలువ చేసే వందలాది ఎకరాల వ్యవసాయ, వ్యవసా