వరంగల్: జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన శనివారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో TG-iPASS ద్వారా పారిశ్రామిక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న అంశాలను వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఇటీవల TG-iPASS ద్వారా దరఖాస్తు చేసుకున్న 19 పరిశ్రమలకు సంబంధించి మొత్తం రూ.16.03 కోట్ల పెట్టుబడులతో 152 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు వివరించారు. ఆయా పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, క్లియరెన్స్లను నిబంధనల మేరకు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం TPRIDE పథకం కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు చెందిన 9 వాహనాలకు రూ.31.52 లక్షల రాయితీని కమిటీ ద్వారా మంజూరు చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జి.ఏం ఇండస్ట్రియల్ నరసింహ మూర్తి ,లీడ్ బ్యాంక్ మేనేజర్ జీవన్ కుమార్ సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’