భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: ఆలయాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావిస్తూ భీమ్గల్ యోగ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని నందిగల్లీలో ఉన్న శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలో యోగ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరిశుభ్రత పనులు చేపట్టారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, దుమ్ము, వ్యర్థాలను తొలగించి శుభ్రంగా తీర్చిదిద్దారు. ఆలయంలోని పూజా సామగ్రిని క్రమబద్ధీకరించారు. యోగ సాధనతో పాటు సమాజ సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సభ్యులు తెలిపారు. దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా భగవంతుడికి చేసే సేవలో భాగమని పేర్కొన్నారు. ప్రతి ఆదివారం గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు, ఆలయానికి వచ్చే ప్రజలు పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న యోగ సభ్యులను స్థానికులు అభినందించారు