Lionel Messi : ఫుట్బాల్ అభిమానులకు గుడ్న్యూస్. నిరుడు అర్ధాంతరంగా ముగిసిన లియోనల్ మెస్సీ(Lionel Mess) ఈవెంట్ డబ్బులను అభిమానులకు బెంగాల్ ప్రభుత్వం తిరిగిచెల్లించనుంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి(Suvendu Adhikari) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు 33 వేలమందికి టికెట్ పైసలు వాపస్ చేస్తామని సీఎం పేర్కొన్నారు. ‘ది గోట్ ఇండియా టూర్-2025’లో భాగంగా భారత్కు వచ్చిన లియోనల్ మెస్సీ బృందం తేదీన బెంగాల్లో పర్యటించాడు. డిసెంబర్ 31వ తేదీని మెస్సీ టీమ్ రాకతో స్థానిక లేక్ సిటీ సమీపంలోని యువ భారతి స్టేడియం కిక్కిరిసిపోయింది. అయితే.. సాకర్ మాంత్రికుడిని పలువురు చుట్టుముట్టడంతో భద్రతా చర్యల్లో భాగంగా అర్ధాంతరంగా అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు పోలీసులు. దాంతో, మెస్సీని చూడలేకపోయిన ఆగ్రహాంతో అభిమానులు స్టేడియంలో కుర్చీలు కిందపడేసి నానా రచ్చ చేశారు. రూ.4 వేల నుంచి రూ.6 వేల టికెట్ కొని.. స్టేడియానికి వస్తే నిర్వాహకులు తీరుతో అర్జెంటీనా స్టార్ను ప్రత్యక్షంగా చూడలేకపోయారు పలువురు. ఆగస్టు 29, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రస్తావించారు. ఆరోజు మెస్సీ ఈవెంట్కు టికెట్లు కొన్న వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. ‘మెస్సీకి భారీగా అభిమానగణం ఉంది. అతడిని కళ్లారా చూసేందుకు వారు రూ.4 వేలు, రూ.6 వేలు పెట్టి టికెట్లు కొన్నారు. మెస్సీని చూసేందుకని టికెట్లు కొని.. నిరాశతో వెనుదిరిగిన 33వేల మందికి వారి డబ్బును తిరిగి చెల్లించాలని నేను అనుకుంటున్నా. అందకు సంబంధించిన ప్రక్రియను నేను ఇప్పటికే ప్రారంభించాను. ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందని నేను అశిస్తున్నా’ అని సువేందు అధికారి పేర్కొన్నారు