CM Chandrababu : మన అమ్మభాష తెలుగు వైభవాన్ని , లిపి గొప్పదనాన్ని రాబోయే భావితరాలకు సజీవంగా అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కేవలం మాటల్లోనే కాకుండా అక్షరాల్లోనూ తెలుగు భాష ప్రాభవం తరతరాలకు నిలిచిపోవాలని ఆయన ఆకాంక్షించారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు తెలుగు చదవడం, రాయడంలో ఆసక్తి పెంచేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పిన ఆయన, ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన మాతృభాషను భవిష్యత్తు వైపు నడిపించాలంటే చిన్నతనం నుంచే పునాది పడాలని చంద్రబాబు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలలో అక్షరంపై మమకారాన్ని, భాష పట్ల అభిమానాన్ని నింపితేనే మన తెలుగు లిపి భవిష్యత్తులో మరింత వెలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కెట్లోకి వచ్చిన ‘కూల్ఫబెట్స్’ (Coolphabets) అనే నూతన డిజిటల్ యాప్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆటపాటల రూపంలో పిల్లలకు తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషలను చదవడం, రాయడం సులువుగా నేర్పించేలా ఈ యాప్ను రూపొందించడం ఎంతో మెచ్చుకోదగిన విషయమని కొనియాడారు. ఈ యాప్ రూపకర్తలు కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటి , వారి టీమ్ను ఆయన అభినందనలతో ముంచెత్తారు. ఈ యాప్లో ఉపయోగించిన నూతన సాంకేతికతను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఆధారంగా పిల్లలు రాసే చేతిరాతను పరిశీలించి, వారి రాతను మరింత మెరుగుపరచడానికి తగిన మార్గదర్శకత్వం అందించేలా యాప్ను డిజైన్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో సాంకేతికత అనేది మన మాతృభాషను మనకు దూరం చేసేదిగా కాకుండా, మన సంస్కృతికి , భాషకు మరింత చేరువ చేసే సాధనంగా మారాలని ఆయన హితవు పలికారు. మన భాష, మన లిపి, మన సాంస్కృతిక మూలాలే తెలుగు జాతికి అసలైన గుర్తింపు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తేనెలొలికే మన తీయని తెలుగు భాష రాబోయే తరాలలోనూ చిరస్థాయిగా వెలుగొందాలని ఆయన ఆకాంక్షించారు. మాతృభాషా పరిరక్షణకు, భాషాభివృద్ధికి ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై ప్రస్తుతం పలువురు భాషాభిమానులు, నెటిజన్ల నుంచి విస్తృత స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంట్రెస్ట్ను కూడా అందిస్తుంది