జైనూర్, ఆంధ్రప్రభ : జైనూర్ మండల కేంద్రంలో డాక్టర్ సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠె 106వ జయంతి వేడుకలను మాంగ్ సమాజ్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభావు సాఠె విగ్రహానికి, ఇతర మహనీయుల విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాంగ్ సమాజ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మోహాలే దత్త మాంగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకషాహీర్ అన్నాభావు సాఠెను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అత్యంత వెనుకబడిన మాంగ్ సమాజ్ అభివృద్ధికి ప్రత్యేక మాంగ్ సమాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలు చదువుకునేందుకు గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలని, రిజర్వేషన్లలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాంగ్ సమాజ్ మహనీయులను తగిన విధంగా గౌరవించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే మాంగ్ రైతుల పాత పహాణీ పత్రాలను పునరుద్ధరించి, రైతులకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాంగ్ సమాజ్ తెలంగాణ ఉద్యోగ కమిటీ అధ్యక్షుడు తరుడె వసంత్రావు మాంగ్ సమాజ్ ప్రగతికి కృషి చేస్తున్న పలువురిని ‘మాంగ్ సమాజ్ రత్న’ అవార్డులతో ఘనంగా సత్కరించారు. అవార్డు గ్రహీతలుగా రాష్ట్ర కోశాధికారి గాయ్ కాంబ్లే కుషాల్రావు మాంగ్, మోహాలే దత్త మాంగ్ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల పోరాట జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దావుల రమేష్, మాంగ్ సమాజ్ తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాడేకర్ రామేశ్వర్ మాంగ్, విద్యార్థి విభాగం నాయకుడు కాంబ్లే సాయి మాంగ్, మండల అధ్యక్షుడు కాంబ్లే నాగ్నాథ్ మాంగ్, గాదిగూడ మండల అధ్యక్షుడు, జైనూర్ మండల అధ్యక్షుడు వాగ్మారే అంకుష్ మాంగ్, అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంబ్లే బాబాసాహెబ్, పవర్గూడ సర్పంచ్ తోడసం రాజేందర్, మాంగ్ సమాజ్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు