కూలీలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న చింత శరత్కుమార్రెడ్డి ఆలస్యమైన కూలి బిల్లుల పరిష్కారానికి అధికారులతో మాట్లాడతామని హామీ శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం అల్లాపల్లి గ్రామం పగడాలవారిపల్లిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింత శరత్కుమార్రెడ్డి సోమవారం పరిశీలించారు. పనుల్లో నిమగ్నమైన కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరుగుతున్నాయా, కూలీలకు అవసరమైన సౌకర్యాలు అందుతున్నాయా, కూలి బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు తమకు రావాల్సిన కూలి బిల్లులు ఆలస్యమవుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చింత శరత్కుమార్రెడ్డి కూలీలకు రావాల్సిన బిల్లులు ఆలస్యం కాకుండా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న వీబీజీ రాంజీ పథకంలో ప్రతి 15 రోజులకు ఒకసారి కూలీలకు బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉందని వివరించారు. ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ఎంతో కీలకమని, నిరంతరం పనులు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పనుల్లో పాల్గొంటున్న కూలీలకు అరటి పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వీరాంజనేయులు, కౌలు రైతుల రాష్ట్ర కో-కన్వీనర్ ఎస్. హనుమంత్రెడ్డి, కౌలు రైతుల మండల కన్వీనర్ జగదీష్, నాగప్ప, కిష్టప్ప, నరేష్, తాజుద్దీన్, కూటమి నాయకుడు పలక గంగన్న తదితరులు పాల్గొన్నారు