పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ ఇన్చార్జి పొత్తూరి రామరాజు నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురం నియోజకవర్గంలో సెప్టెంబర్ 1న జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పొత్తూరి రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ముఖ్యమంత్రి కార్యక్రమాల కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేశ్వరరావుతో కలిసి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మొగల్తూరులో హెలిప్యాడ్ ప్రాంతం, పార్టీ కార్యకర్తల సమావేశ స్థలం, ప్రజా సభ వేదిక ప్రాంతాలను పరిశీలించి అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్ల వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొత్తూరి రామరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనను పార్టీ శ్రేణులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, నియోజకవర్గ పరిశీలకుడు శేషు, రాష్ట్ర కార్యదర్శి కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, మార్కెట్ యార్డు చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, నర్సాపురం మండల అధ్యక్షుడు వాతాడి ఉమామహేశ్వరరావు, మొగల్తూరు మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు తదితరులు పాల్గొన్నారు