వెలిగొండతో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు లక్షలాది ప్రజలకు తాగునీటి భరోసా చంద్రబాబు చేతుల మీదుగానే నేడు జాతికి అంకితం మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వెలిగొండ నిలువెత్తు నిదర్శనం వెలిగొండతో కరువు, వలసలకు శాశ్వత పరిష్కారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, ఆంధ్రప్రభ: దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతుల జీవితాల్లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కొత్త వెలుగులు నింపబోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సందర్భంగా ఇది రాష్ట్ర సాగునీటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.53 టీఎంసీల కృష్ణా వరద జలాలను నల్లమల కొండల గుండా మళ్లించి మొత్తం 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాలో 3,08,700 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 27,400 ఎకరాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84,000 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టును రూపొందించినట్లు అచ్చెన్నాయుడు వివరించారు. వెలిగొండ కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదని.. తరతరాలుగా కరువుతో పోరాడుతున్న రైతుకు భరోసా అని మంత్రి పేర్కొన్నారు