టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన క్రికెట్ తెలివితేటలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దులీప్ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో ఈ 15 ఏళ్ల క్రికెటర్కు అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు దక్కగా.. తొలి అవకాశంలోనే తన నిర్ణయ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. కేవలం మూడు సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉండగా DRS తీసుకుని కీలక వికెట్ను సాధించాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్కు ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే వికెట్ కీపింగ్ చేస్తుండగా ఇషాన్ కిషన్ కుడి మణికట్టుకు గాయం కావడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఎలైట్ స్థాయి క్రికెట్లో అతడికి ఇదే తొలి కెప్టెన్సీ అవకాశం. సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్ చేశాడు. అతడి బంతి ఆర్యన్ జుయాల్ బ్యాట్ను దాటుకుంటూ వెళ్లింది. క్యాచ్ వెనుకకు వెళ్లడంతో ఈస్ట్ జోన్ ఆటగాళ్లు వికెట్ దక్కిందని సంబరపడ్డారు. అయితే ఫీల్డ్ అంపైర్ మాత్రం బ్యాట్కు బంతి తగలలేదని భావించి నాటౌట్గా ప్రకటించాడు. అప్పుడు వైభవ్ సూర్యవంశీ తన సహచరులతో చర్చించాడు. DRS తీసుకోవడానికి కేవలం మూడు సెకన్లు మాత్రమే మిగిలి ఉండగా.. వైభవ్ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి బ్యాట్ అంచును స్వల్పంగా తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణయం మారింది. ఆర్యన్ జుయాల్ 46 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. అంతే.. వైభవ్ తీసుకున్న రిస్క్ ఫలించింది! కీలక వికెట్ దక్కిన తర్వాత వైభవ్ సూర్యవంశీ చేసిన సెలబ్రేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సన్గ్లాసెస్ను సరిచేసుకుంటూ సహచరుల వైపు అతడు ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కెప్టెన్గా తొలి పెద్ద పరీక్షలోనే ఇంత ప్రశాంతంగా, చివరి క్షణంలో నిర్ణయం తీసుకోవడంపై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెట్ అయిన బ్యాటర్ను పెవిలియన్కు పంపిన నిర్ణయం.. ఆర్యన్ జుయాల్ అప్పటివరకు క్రీజులో నిలదొక్కుకున్నాడు. అతడు 46 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు. అలాంటి సమయంలో అతడి వికెట్ ఈస్ట్ జోన్కు చాలా ముఖ్యంగా మారింది. వైభవ్ సూర్యవంశీ తీసుకున్న DRS నిర్ణయం కారణంగానే ఆ వికెట్ లభించింది. దీంతో సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్కు కొంత బ్రేక్ పడింది. కెప్టెన్గా తొలి అడుగులోనే ఆకట్టుకున్న వైభవ్.. వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్సీ కొత్తేమీ కాదని చెప్పలేం. గతంలో రంజీ ట్రోఫీలో బిహార్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఏడాది ప్రపంచకప్ గెలిచిన భారత అండర్-19 జట్టుకు కూడా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే సీనియర్ స్థాయి ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీలో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం మాత్రం ఇదే. తొలి అవకాశంలోనే కీలక DRS నిర్ణయంతో వికెట్ సాధించడం అతడి క్రికెట్ మేధస్సుకు నిదర్శనంగా నిలిచింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీ ఆరంభమే ఇలా ఉంటే.. భవిష్యత్తులో అతడి నాయకత్వ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి. 2013లో జర్నలిస్ట్గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్సైట్లలో కంటెంట్ రైటర్గా పని చేశాను. డిజిట