Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో ఓటర్ల సవరణ ప్రక్రియ ఉత్కంఠగా, గందరగోళంగా మారుతోంది. అధికారులు ఎన్ని సూచనలు చేస్తున్నా, అవగాహన లోపంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దస్తురాబాద్ మండల కేంద్రంలో ప్రస్తుతం ఓటరు సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిబంధనల ప్రకారం అర్హులైన ఓటర్లకు అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసు ప్రకారం ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల అధికారిక ధ్రువపత్రాలలో ఏదో ఒక పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించి తమ నోటీసును క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులైన ఓటర్లు ఏ పత్రాలు సమర్పించాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కార్యాలయం వద్ద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, సరైన పత్రాలు వెంట తెచ్చుకోకపోవడంతో ఓటర్లు అస్తవ్యస్త పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా మరింత స్పష్టమైన ప్రచారం నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు