ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హిందుత్వం మూల సూత్రం సహనమేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తాము సాధారణంగా స్పందించబోమని, అయితే ప్రస్తుతం చర్చ జరుగుతున్న అంశంలోని సూత్రం మాత్రం పూర్తిగా సరైనదేనని పేర్కొన్నారు. హిందూ నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని, అనేక దండయాత్రలు ఎదురైనా తన మూల విలువలను బలంగా కాపాడుకోవడం వల్లే అది నిలబడిందని ఫడ్నవీస్ అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దండయాత్రలను కూడా సహనంతో ఎదుర్కొని, వారిలో అనేక మందిని భారతీయ సాంస్కృతిక ప్రవాహంలో భాగం చేసుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు తిరస్కరించిన అనేక మందికి కూడా భారత్ ఆశ్రయం కల్పించిందని గుర్తుచేశారు. అందుకే హిందువులకు మత సహనం గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, సహనం హిందువుల రక్తంలోనే ఉందని వ్యాఖ్యానించారు. హిందుత్వంలో సహనం ఒక ప్రాథమిక అంశమని స్పష్టం చేశారు. అయితే ఎవరైనా దాడి చేస్తే దానికి తగిన ప్రతిస్పందన తప్పనిసరిగా ఉంటుందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. కానీ ఒక హిందువు స్వయంగా దాడిని ప్రారంభించడని ఆయన అన్నారు