Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామానికి చెందిన చిన్నారి కాగిత గీత్విక జాతీయ స్థాయి వేదికపై తన కూచిపూడి నృత్య ప్రతిభను చాటుకుంది. విజయ మాధవి సేవా సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నేషనల్ లెవెల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్–14లో గీత్విక కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. విజయవాడకు చెందిన నాట్య తరంగిణి కూచిపూడి డాన్స్ అకాడమీలో గురువు మలిశెట్టి అనూష నాయుడు వద్ద శిక్షణ పొందుతున్న గీత్విక, చిన్న వయసులోనే నృత్యంలో విశేష ప్రతిభను కనబరుస్తోంది. జాతీయ స్థాయి కళోత్సవంలో సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని చక్కటి హావభావాలు, లయబద్ధమైన నృత్య కదలికలతో ప్రదర్శించి సభికుల ప్రశంసలు అందుకుంది. పోరంకి గ్రామానికి చెందిన చిన్నారి జాతీయ స్థాయి వేదికపై కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు, నాట్యాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. గీత్వికను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి వేదికలపై రాణించాలని ఆకాంక్షించారు. గురువు మలిశెట్టి అనూష నాయుడు మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు