Veernapalli: S.I.R ఫేజ్-2 ప్రక్రియను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రవీణ్ జె. టోనీ సూచించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా సంతోష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. TPCC ఆదేశాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనల మేరకు పార్టీ శ్రేణులు S.I.R ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. B.L.Aలు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. నోటీసులు అందుకున్న ప్రతి అర్హత కలిగిన ఓటరు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ పేర్లను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రజలకు S.I.R ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ అవసరమైన పత్రాలు, వివరాల విషయంలో B.L.Aలు సహకరించాలని అన్నారు. ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫేజ్-2 ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు B.L.Aలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ప్రవీణ్ జె. టోనీ కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, సర్పంచులు రాకేష్ గౌడ్, సాయిలు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రవీందర్తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు