నల్లబెల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ర్యాలీ స్థలాన్ని ఆయన వెళ్లిన అనంతరం శుద్ధి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ నల్లబెల్లి మండల కార్యదర్శి పరికి కోర్నేలు డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను కాలరాసే ఇలాంటి కుల వివక్ష చర్యలను తీవ్రంగా ఖండించాలని అన్నారు. నల్లబెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఆగస్టు 8న జరిగిన ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారని తెలిపారు. ఆయన వెళ్లిన అనంతరం ఆగస్టు 10న కొందరు వ్యక్తులు ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఈ ఘటన కుల అహంకారాన్ని ప్రతిబింబించడమే కాకుండా అంటరానితనాన్ని ప్రోత్సహించే చర్యగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణమన్నారు. పైగా ఎన్డీఏ ప్రభుత్వంలోని మంత్రి జీతన్రామ్ మాంఝీ ఈ చర్యను సమర్థించడం మరింత ఆందోళన కలిగించే విషయమన్నారు. గత 12 ఏళ్లుగా దేశంలో దళితులపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని ఆరోపించారు. దళితులపై జరుగుతున్న వివక్ష, దాడులను ఎదుర్కొనేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పరికి కోర్నేలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి మామిండ్ల పెద్ద ఐలయ్య, బొట్ల సాంబయ్య, భూక్య రమేష్, హుస్సేన్, భద్రు తదితరులు పాల్గొన్నారు