Kaizer News

స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగుల కొత్త ఘనత..

స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగుల కొత్త ఘనత..

· Sports · prabhanews.com

లండన్, ఆంధ్రప్రభ: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ పేరిట ఉన్న స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. పాంటింగ్ స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో 7,578 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, తాజాగా జో రూట్ 7,594 పరుగులకు చేరుకుని ఆ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. రెండో ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేసిన రూట్.. పాంటింగ్ రికార్డును అధిగమించడం విశేషం. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 7,216 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహేలా జయవర్ధనే, జాక్వెస్ కల్లిస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మ్యాచ్ రెండో రోజు ఇంగ్లండ్ పేసర్లు చెలరేగడంతో పాకిస్థాన్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. పాకిస్థాన్ జట్టు కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అజాన్ అవైస్ 46 పరుగులతో పోరాడినా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. పునరాగమనం చేసిన బాబర్ ఆజమ్ 8 పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆలీ రాబిన్సన్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు, జోష్ టంగ్ రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బతీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు కూడా ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ సమయంలోనే జో రూట్ తన రికార్డు మైలురాయిని అందుకోవడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఓపెనర్ ఎమిలియో గెయ్ 30 పరుగులతో అజేయంగా ఉండగా, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇప్పటికే 261 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించింది

Original source: prabhanews.com
Read more on Kaizer News