Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీవీ9 “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, రాబోయే సవాళ్లపై విస్త్రతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోని విభేదాలు, బీసీల ప్రాతినిధ్యం, కులగణన వంటి అనేక అంశాలపై తన స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సహజమని మహేష్ కుమార్ గౌడ్ అంగీకరించారు. “కాంగ్రెస్ పెద్ద పార్టీ, పదవులు తక్కువ ఉన్నప్పుడు కాంపిటీటర్స్ ఎక్కువ ఉంటారు. ఎలిజిబుల్ లీడర్షిప్ పెద్దది ఉంది. నాచురల్లీ గ్రూప్స్ ఉంటాయి. కానీ దాన్ని ఆ గ్రూపులు కూడా కొంత ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణంలోనే ఉంటాయి” అని ఆయన వివరించారు. తాను ఏ గ్రూపునకు ఆద్యం పోసేవాడిని కాదని, గ్రూపులను ఎంకరేజ్ చేయనని, తాను న్యూట్రల్ ఫేస్నని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీతో కలిసి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు గ్యాప్ ఉందన్న ప్రచారాన్ని “ప్రతిపక్ష పార్టీలు అదే చెప్తాయి” అంటూ కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, తాము నిరంతరం కలుస్తూ మాట్లాడుకుంటామని తెలిపారు