షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్-2026 తొలి మ్యాచ్లోనే పరుగుల వరద పారింది. అమృత్సర్ సూర్మాస్, మొహాలీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా 520 పరుగులు నమోదయ్యాయి. భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 26 బంతుల్లో 77 పరుగులతో మెరుపులు మెరిపించినా.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసక శతకంతో మొహాలీ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మొహాలీ కింగ్స్కు అన్మోల్ప్రీత్ సింగ్ ఊహించని స్థాయిలో అండగా నిలిచాడు. కేవలం 51 బంతుల్లోనే 133 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లు ఉన్నాయి. అతడి స్ట్రైక్రేట్ ఏకంగా 260.78గా నమోదైంది. టీ20 కెరీర్లో అన్మోల్ప్రీత్కు ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. అంతేకాదు.. ఈ లీగ్లో తొలి మ్యాచ్లోనే శతకం సాధించిన తొలి బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. అంతకుముందు టాస్ గెలిచిన మొహాలీ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అతడి స్ట్రైక్రేట్ 296.15. సహజ్ ధావన్ 18 బంతుల్లో 45, నామన్ ధీర్ 22 బంతుల్లో 47 పరుగులతో రాణించడంతో అమృత్సర్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లు పూర్తికాకముందే 19.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. 259 పరుగుల లక్ష్యం మొహాలీ కింగ్స్కు అంత సులభం కాదనిపించినా.. అన్మోల్ప్రీత్ సింగ్ దూకుడుతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. అతడికి కెప్టెన్ రమన్దీప్ సింగ్ కూడా అద్భుతంగా సహకరించాడు. రమన్దీప్ 40 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. హర్ప్రీత్ బ్రార్ 8 బంతుల్లో 23 పరుగులతో కీలక సహకారం అందించాడు. మొహాలీ కింగ్స్ 19.3 ఓవర్లలోనే 262/5 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. అన్మోల్ప్రీత్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ మ్యాచ్లో నమోదైన ఛేదన కూడా ప్రత్యేకమే. 259 పరుగుల లక్ష్యాన్ని మొహాలీ కింగ్స్ విజయవంతంగా ఛేదించడంతో.. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాల ఛేదనల్లో ఇది ఐదో స్థానంలో నిలిచింది. షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ ఆరంభ మ్యాచ్లోనే ఇంతటి భారీ స్కోర్లు, మెరుపు బ్యాటింగ్ కనిపించడంతో.. రానున్న మ్యాచ్లపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి