నదిలో ఏటా ప్రవహించే నీటి పరిమాణానికి సమానంగా రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి.. తాగు నీటికీ కటకటే! సముద్రంలో కలిసే జలాలు 1973.44 టీఎంసీల నుంచి 458.12 టీఎంసీలకు తగ్గుదల భూమి పొరల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చి చౌడుబారిపోతున్న కృష్ణా డెల్టా సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్) సంక్షోభంలోకి కూరుకుపోతోందా? బేసిన్లో దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి తీవ్రం కానుందా? కృష్ణా డెల్టా చౌడుబారిపోయి సాగుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఐడబ్ల్యూఎంఐ) అధ్యయన నివేదిక. పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి – కృష్ణా నదులను అనుసంధానం చేయకపోతే కృష్ణా డెల్టాలో సాగు నీరు దేవుడెరుగు గుక్కెడు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తోంది. కృష్ణా బేసిన్లో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, సాగు నీటి ప్రాజెక్టులు, పంటల సాగు, ప్రజల జీవనంపై ఐడబ్ల్యూఎంఐ విస్తృతంగా అధ్యయనం చేసింది. బేసిన్ మూసుకుపోతున్నట్లుగా గుర్తించింది. ఒక నదిలో ఏటా సగటున ప్రవాహించే నీటి పరిమాణానికి సమానంగా నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించడాన్ని బేసిన్ ‘మూసుకోపోవడం (క్లోజర్)’ అంటారు. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా సగటున 2,060 టీఎంసీల లభ్యత ఉంటుంది. 2005 నాటికే బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1920.58 టీఎంసీలు. అంటే.. 75 శాతం లభ్యత ఆధారంగా లభించే నీటిలో 80 శాతాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం రిజర్వాయర్లకు ఉంది. దాంతో కృష్ణా బేసిన్ మూసుకుపోయినట్లుగా ఐడబ్ల్యూఎంఐ ప్రకటించింది. ఐడబ్ల్యూఎంఐ నివేదికలో ప్రధానాంశాలు.. » మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో సతారా జిల్లాలో మహాబలేశ్వర్కు సమీపంలో జోర్ గ్రామం వద్ద సముద్రమట్టానికి 1,337 మీటర్ల ఎత్తులో పురుడు పోసుకునే కృష్ణమ్మ.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఏపీలోని కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. » కృష్ణా పరివాహక ప్రాంతం (బేసిన్) 2,58,948 చదరపు కిలోమీటర్లు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కృష్ణా బేసిన్ విస్తీర్ణం 8 శాతం. కృష్ణా బేసిన్ వైశాల్యంలో పశ్చిమ కనుమల పరిధి కేవలం 9.7 శాతమే. కానీ.. కృష్ణా నదిలో ప్రవహించే ప్రవాహంలో 57 శాతం జలాలు పశ్చిమ కనుమల్లో కురిసే వర్షపాతం నుంచే వస్తాయి. » కృష్ణా నదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు పంపిణీ చేయడానికి కేంద్రం 1969లో ట్రిబ్యునల్ను ఏర్పాటుచేసింది. ఆ ట్రిబ్యునల్ 1976లో తీర్పు ఇచ్చింది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన ట్రిబ్యునల్.. ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీలు, కర్ణాటకకు 700, మహారాష్ట్రకు 560 టీఎంసీలను కేటాయించింది. » బేసిన్లో రాష్ట్రాలకు కేటాయించిన నీటి కంటే డిమాండ్ 200 శాతం అధికంగా ఉంది. ఇక కృష్ణా బేసిన్లో 50 శాతం సాగు భూమిలో చెరువులు, బోరు బావులు, వర్షాధారంగా పంటలు సాగుచేస్తున్నారు. » 2005 నాటికే కృష్ణాతోపాటు ఉప నదులు మలప్రభ, ఘ