Kaizer News

IPL Elections | ఐపీఎల్‌లో ఎన్నికలకు వేళైంది.. ఛైర్

IPL Elections | ఐపీఎల్‌లో ఎన్నికలకు వేళైంది.. ఛైర్మన్‌గా మళ్లీ అతడేనా..!

· Sports · ntnews.com

IPL Elections : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అనగానే టీ20 క్రికెట్ సందడి గుర్తుకొస్తుంది. స్టార్ ఆటగాళ్ల మెరుపులతో మార్మోగిపోయే ఐపీఎల్‌లో ఎన్నికల సందడి మొదలైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఎలక్టోరల్ అధికారి ఏకే జోటీ శనివారం రెండు కీలక పదవులకు నోటిఫికేషన్ ఇచ్చారు. పాలక మండలిలోని ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తాని ఆయన తెలిపారు. అయితే.. ప్రస్తుతం ఐపీఎల్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న అరుణ్ సింగ్ ధుమాల్ మరోసారి రేసలో ఉండనున్నారు. దాంతో.. ఆయన మరోసారి ఎన్నికవ్వడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్‌ పాలక మండలిలోని రెండు కీలక పదవులకు బీసీసీఐ ఎన్నికలు నిర్వహించనుంది. ఎలక్టోరల్ అఫీసర్ ఏకే జోటి శనివారం ప్రకటించారు. బీసీసీఐ రాజ్యాంగంలోని నిబంధన 28 ప్రకారం ఈ రెండు పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. బీసీసీఐ వార్షిక సమావేశం జరుగనున్న సెప్టెంబర్ 18వ తేదీన ఎలక్షన్ ఉంటుందని జోటి పేర్కొన్నారు. 28వ నియమం ప్రకారం ఐపీఎల్ పాలకమండలిలో నలుగురు సభ్యులు ఉండాలి. వీరిలో ఇద్దరిని బీసీసీఐ వార్షిక సమావేశంలో ఎన్నుకుంటారు. నిరుడు ఐపీఎల్ ఛైర్మన్‌గా ఎన్నికైన అరుణ్‌ సింగ్ ధుమాల్ (హిమాచల్ ప్రదేశ్ బోర్డు‌), ఐపీఎల్ పాలకవర్గంలో సభ్యుడైన ఖైరుల్ జమాల్ మజుందార్‌ (మిజోరాం బోర్డు) పదవీ కాలం ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఏడాదిలో ఎన్నికలు నిర్వహించాలి. దాంతో, బీసీసీఐ ఎలక్టోరల్ అధికారి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ ఇద్దరూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ధుమాల్, మజుందార్‌లు సెప్టెంబర్ 9 లేదా 10వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం.. పోటీలో ఉన్న వారి పేర్లను సెప్టెంబర్ 12వ తేదీన ప్రకటిస్తారు. సెప్టెంబర్ 18వ తేదీన బీసీసీఐ సమావేశంలో సభ్యులు.. ఇద్దరిని ఎన్నుకుంటారు. మిగతా ఇద్దరు.. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, కోశాధికారి రఘురామ్ భట్. ఐపీఎల్ పాలక మండలిలో.. ఏడుగురు సభ్యులు ఉంటారు. పాలకవర్గంలోని నలుగురు ప్రతినిధులతో పాటు బీసీసీఐ సీఈవో, భారత క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి, ఒక కాగ్ నామినీ ఒకరు ఐపీఎల్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు

Original source: ntnews.com
Read more on Kaizer News