పెండింగ్ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి: ఆర్డీఓ బాలకృష్ణ నరసరావుపేట, ఆంధ్రప్రభ: ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు నరసరావుపేటలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 97-నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ కె. బాలకృష్ణ అధ్యక్షతన స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు పాఠం-9తో పాటు ఫారం-10, ఫారం-11, ఫారం-11ఏ, ఫారం-11బీలకు సంబంధించిన అంశాలను వివరించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫారం-6, ఫారం-7, ఫారం-8లకు సంబంధించి అందిన దరఖాస్తులను సంబంధిత సహాయ ఓటరు నమోదు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లతో సమన్వయం చేసుకుని అవసరమైన నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల క్లెయిమ్ల పెండింగ్ సంఖ్యను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటర్లకు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సహాయ ఓటరు నమోదు అధికారులు, నరసరావుపేట తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, రొంపిచర్ల తహసీల్దార్ నిర్మల, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎన్నికల సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు