Kaizer News

Nepal Flash Floods | నేపాల్ జ‌ల విల‌యం.. 670 దాటిన

Nepal Flash Floods | నేపాల్ జ‌ల విల‌యం.. 670 దాటిన మృతుల సంఖ్య‌.. కొన‌సాగుతున్న భార‌త సాయం..!

· National - India · ntnews.com

Nepal Flash Floods : పొరుగు దేశం నేపాల్‌ (Nepal) లో భారీ వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. భోటేకోశి నది (Bhote Koshi River) కి ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా సంభవించిన ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న‌ది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 670కి పైగా మృతదేహాలను వెలికితీశారు. మరో 2,498 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తు పర్యాటకుల (Tourists) పైనా తీవ్ర ప్రభావం చూపింది. 589 మంది విదేశీయులతో సహా మొత్తం 753 మంది ప‌ర్యాటకులు గ‌ల్లంత‌య్యారు. ఈ విష‌యాన్ని నేపాల్ పర్యాటక శాఖ శ‌నివారం సాయంత్రం ప్రకటించింది. ఈ ఆక‌స్మిక‌ వరదల వల్ల రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. బాధితులను ఆదుకోవడానికి సహాయక సామగ్రిని విరాళంగా ఇవ్వాలని స్థానిక సంస్థలు, ప్రజలను ఖాట్మండు జిల్లా యంత్రాంగం కోరినట్లు జిన్హువా వార్తా సంస్థ తన కథనంలో పేర్కొన్న‌ది. ఈ కష్టకాలంలో నేపాల్‌కు అండగా నిలుస్తున్న భారత్ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. తాజాగా నాలుగో విడతగా 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన C-130 విమానాన్ని నేపాల్‌కు పంపినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ విమానంలో గాలింపు చర్యల కోసం ప్రత్యేక సాంకేతిక బృందం, వారి పరికరాలు, మృతదేహాల గుర్తింపు కోసం ఫోరెన్సిక్ నిపుణులు, వారికి అవసరమైన డీఎన్ఏ విశ్లేషణ కిట్లు ఉన్నాయని జై శంక‌ర్‌ ‘ఎక్స్‌’ లో వెల్లడించారు. వీటితోపాటు దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లు వంటివి కూడా పంపినట్లు వివరించారు. ఇప్పటికే 230 అడుగుల పొడవైన మాడ్యులర్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పరికరాలతో 16 ట్రక్కులు నేపాల్‌కు చేరుకున్నాయని, మరో ఏడు బెయిలీ వంతెనల నిర్మాణానికి కూడా త్వరలో సామగ్రిని సరఫరా చేస్తామని జైశంకర్ తెలిపారు. వీటిని నిర్మించేందుకు సాంకేతిక బృందాలు కూడా త్వరలో అక్కడికి చేరుకుంటాయన్నారు. ఇప్పటివరకు మొత్తం 68.5 టన్నుల సహాయక సామగ్రిని విమానాల ద్వారా ఖాట్మండుకు తరలించినట్లు విదేశాంగ శాఖ పేర్కొన్న‌ది. నేపాల్‌లో సహాయక చర్యలకు తమ మద్దతు కొనసాగుతుందని భారత్ స్పష్టంచేసింది

Original source: ntnews.com
Read more on Kaizer News