వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశం.. మండలి ఛైర్మన్కు రాజీనామా లేఖ ఇవ్వాలని సూచన హైదరాబాద్, ఆంధ్రప్రభ: మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్పై ఎంఐఎం కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఎంఐఎం ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని, రాజీనామా లేఖను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్కు సమర్పించాలని పార్టీ ఆదేశించినట్లు తెలుస్తోంది. అత్తాపూర్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా కొందరు యువకులు మీర్జా రహ్మత్ బేగ్ను పట్టుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. అనంతరం ఆయనను కొట్టి, ఘటనకు సంబంధించిన వీడియోలు తీశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తు వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆరోపణలు అత్యంత తీవ్రమైన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది