వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటుచూసినా శిథిలాల దిబ్బలే 4,451 మందిని రక్షించిన అధికారులు.. మరో 1,924 మంది గల్లంతు నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 21 మంది తమిళనాడు వాసులు భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం భోటెకోశి, త్రిశూలిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన కఠ్మాండు/బీజింగ్: సుందర హిమాలయ దేశం నేపాల్లో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ఆకస్మిక వరదల ధాటికి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 579కు చేరింది. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. భోటెకోశి నదీ ప్రాంతంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో మరోసారి వరదలు వచ్చే ప్రమాదం ఉందన్న అంచనాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుధవారం ఆకస్మిక వరద సంభవించిన చోటే బురదతో కూడిన నీటి మట్టం పెరిగిందని, ఇక్కడ మళ్లీ వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భోటెకోశి, త్రిశూలి ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం ఎదురైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. రసువా, సెంట్రల్ నేపాల్లోని ఇతర ప్రాంతాలను బుధవారం ముంచెత్తిన భారీ ఆకస్మిక వరదల కారణంగా వందల మంది మరణించడంతో పాటు భారీగా నివాస ప్రాంతాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 579 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. వేలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి జాడ తెలియరావడం లేదు. నవల్పరాసి ఈస్ట్లో 154, చిత్వాన్లో 233, గోర్ఖాలో 46, నువాకోట్లో 37 మృతదేహాలను వెలికితీశారు. అలాగే ధాడింగ్లో 40, తానాహులో 30, నవల్పరాసి వెస్ట్లో 27, రసువాలో 12 మృతదేహాలను వెలికితీశారు. టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని గిరోంగ్ కౌంటీలో ఐదుగురు మరణించారు. వరదలు సంభవించినప్పటి నుంచి 86 మంది భద్రతా సిబ్బంది, 517 మంది విదేశీ పర్యాటకులు, 127 మంది నేపాలీ ప్రయాణికులతో సహా కనీసం 1,924 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు వివిధ ప్రభావిత ప్రాంతాల నుంచి 4,451 మందిని రక్షించారు. వీరిలో 85 మంది భారతీయులతో సహా మొత్తం 129 మంది విదేశీయులు, అలాగే వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన 191 మంది ఉన్నారు. గాయపడిన 101 మంది రాజధాని కఠ్మాండులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తమ వారి కోసం ఆసుపత్రుల్లో వెతుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించాం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 85 మంది భారతీయులు, 9 మంది దక్షిణ కొరియన్లు, 16 మంది చైనా పౌరులతో సహా మొత్తం 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించినట్లు నేపాల్ పర్యాటక బోర్డు ప్రకటించింది. గాలింపు, సహాయక చర్యలు మూడో రోజు మరింత ముమ్మరంగా కొనసాగాయని, ఇందులో 2,391 మంది నేపాల్ సైనిక సిబ్బందితో సహా మొత్తం 7,451 మంది భద్రతా సిబ్బంది భాగస్వాములయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. బాధితులను తరలించడానికి హెలికాప్టర్లను ఉపయోగించగా, భూతల బృందాలు నదీ తీరాల్లో, దిగువన ఉన్న నివాస ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్