ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. ‘ఆపరేషన్ మిడ్నైట్ గోల్డ్స్ట్రైక్’ పేరుతో నిర్వహించిన మెరుపు ఆపరేషన్లో ఎయిర్పోర్ట్ ఉద్యోగితో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఐదుగురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 6.85 కిలోల 24 క్యారెట్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.10.75 కోట్లు ఉంటుందని DRI అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ కోసం బంగారాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన మైనపు ముద్దల్లో దాచినట్లు గుర్తించారు. మొత్తం 16 క్యాప్సూల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. DRI దర్యాప్తు ప్రకారం.. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ నెట్వర్క్ ప్రయాణికుల సహాయంతో బంగారాన్ని భారత్కు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్, బ్యాంకాక్, మాలే మార్గాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులను ఈ ముఠా ఉపయోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న ఉద్యోగి కూడా ఈ స్మగ్లింగ్ నెట్వర్క్కు సహకరిస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలో బంగారం తరలింపునకు సంబంధించిన కీలక వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, అరెస్టయిన నిందితులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఇంకా ఎంతమంది ఈ ముఠాలో ఉన్నారు? అనే కోణాల్లో DRI అధికారులు విచారణ ముమ్మరం చేశారు. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి