బెంగళూరు, వెలుగు: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో యువ ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ అద్భుత క్యాచ్తో అదరగొట్టాడు. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో నార్త్ జోన్ బ్యాటర్ అబ్దుల్ సమద్ ఇచ్చిన క్యాచ్ను స్మరణ్ కళ్లు చెదిరేలా ఒడిసిపట్టాడు. సౌత్ జోన్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ వేసిన బంతిని సమద్ ఆడగా.. బ్యాట్ అంచుకు తగిలిన బంతి మొదటి స్లిప్ వైపు వేగంగా దూసుకొచ్చింది. అప్రమత్తంగా ఉన్న స్మరణ్ కుడిచేత్తో అందుకునేందుకు ప్రయత్నించాడు. బంతి చేతిలోంచి జారిపోవడంతో కింద పడబోతుండగా.. వెంటనే ముందుకు డైవ్ చేసి నేలను తాకకముందే రెండు చేతులతో బంతిని పట్టేశాడు. దీంతో సమద్ 19 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో 16 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అతడి వికెట్తో నార్త్ జోన్ 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ అద్భుత క్యాచ్కు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న 20 ఏళ్ల స్మరణ్.. దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ సత్తా చాటుతూ ఆకట్టుకుంటున్నాడు