Kaizer News

జియో.. మెగా ఐపీవోకు సై

జియో.. మెగా ఐపీవోకు సై

· Business · sakshi.com

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం, డిజిటల్‌ సర్వీసుల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 37,700 కోట్లు (3.8 బిలియన్‌ డాలర్లు) సమీకరించనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ సెబీకి ఈ ఏడాది జూన్‌లో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీవోలో 27 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇది ఐపీవో తదుపరి ఈక్విటీ మూలధనంలో 2.9%కి సమానంకాగా.. కంపెనీ విలువ 137 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి దేశీ మార్కెట్లో అతిపెద్ద ఇష్యూగా నిలిచే అవకాశముంది. తద్వారా 2024లో రికార్డ్‌ నెలకొల్పుతూ 3.3 బిలియన్‌ డాలర్ల ఐపీవో చేపట్టిన హ్యుందాయ్‌ మోటార్‌ను అధిగమించనుంది. అంతేకాకుండా దేశీ స్టాక్‌ ఎక్స్చెంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ సైతం భారీ ఐపీవో ద్వారా దాదాపు రూ. 30,000 కోట్లు సమీకరించనుంది. ఇష్యూతో జియో, హ్యుందాయ్‌ తర్వాత ఎన్‌ఎస్‌ఈ నిలవవచ్చనేది మార్కెట్‌ వర్గాల అంచనా. రుణ చెల్లింపులకు జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీవో నిధులలో రూ. 27,500 కోట్లు కీలక అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ గతంలో ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ, పీఈ దిగ్గజాల నుంచి పెట్టుబడులు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. 2020లో మెటాకు 9.99% వాటా కేటాయించడం ద్వారా రూ. 43,574 కోట్లు అందుకోగా.. గూగుల్‌ 7.73 శాతం వాటాకు రూ. 33,737 కోట్లు వెచి్చంచింది. ఈ బాటలో మరో 15.2 శాతం వాటాను సిల్వర్‌ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్‌ అట్లాంటిక్, కేకేఆర్, టీపీజీ, క్వాల్‌కామ్‌ వెంచర్స్, ఇంటెల్‌ క్యాపిటల్‌ తదితర ఫైనాన్షియల్, వ్యూహాత్మక ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాల నుంచి రూ. 74,745 కోట్లు సమకూర్చుకుంది. ప్రస్తుతం కంపెనీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా 66.43% కాగా.. మెటా, గూగుల్‌ సంయుక్తంగా 17.71% వాటాను కలిగి ఉన్నాయి. మిగిలిన వాటా ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీల చేతిలో ఉంది. 2008 తదుపరి రిలయన్స్‌ గ్రూప్‌ నుంచి వస్తున్న తొలి ఐపీవోగా జియో ప్లాట్‌ఫామ్స్‌ నిలవనుంది. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News