పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ కోరలు చాస్తోంది. అక్కడి ప్రధాన నగరాల్లో ఒకటైన లాహోర్లో ధరల మంట సామాన్య ప్రజల నడుము విరుస్తోంది. కూరగాయల నుంచి మొదలుకొని లీటర్ పెట్రోల్, గ్యాస్ సిలిండర్ వరకు ప్రతీది సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. పెరిగిన ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, ఆహార పదార్థాల ధరలతో రోజువారీ కూలీలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు పూట గడవడం గగనంగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజలు రోజుకు రెండు పూటలా కడుపు నిండా అన్నం తినే పరిస్థితులు కూడా అక్కడ కరువయ్యాయి. అక్కడ మార్కెట్కు వెళ్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యం వాడే గోధుమపిండి, వంటనూనె, పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటాయి. కనీసం కూరగాయలు కొందామన్నా బయపడే పరిస్థితి నెలకొంది. బంగాళాదుంపలు, టమోటాల ధరలు కూడా కిలో రూ.150 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. జీతాలు, సంపాదన పెరగకపోయినా నిత్యావసరాల ధరలు మాత్రం రోజూ పెరుగుతూనే ఉన్నాయని, తిండికి డబ్బులు సరిపోక మందులు, పిల్లల చదువులను కూడా పక్కన పెట్టాల్సి వస్తోందని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. . పెన్షన్లు చాలవు.. ఆటో నడిపినా లాభం లేదు! ఈ సంక్షోభం ఉద్యోగ విరమణ పొందిన వృద్ధులను, స్వయం ఉపాధి పొందే వారిని కోలుకోలేని దెబ్బతీసింది. రిటైర్డ్ టీచర్ మన్సూర్ అలీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే అరకొర పెన్షన్తో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించడం అసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉస్మాన్ అలీ అనే ఆటో డ్రైవర్ తన బాధను చెప్పుకొచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు పెరగడంతో రోజంతా కష్టపడి ఆటో నడిపినా, చివరికి ఇంటికి వెళ్లేసరికి చేతిలో రూపాయి కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. RBI: వానలు తగ్గితే మళ్లీ ధరల మంట? సామాన్యుడి జేబుకు 'వర్షం' చిల్లు ప్రభుత్వ ధరలు కాగితాలకే పరిమితం! ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించే ధరలకు, మార్కెట్లో అమ్ముతున్న ధరలకు అసలు సంబంధమే ఉండటం లేదని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను వ్యాపారులు నల్లబజారులో అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తుతున్నారు. ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గాయని చెప్తున్నా.. ఆ తగ్గుదల మార్కెట్లో కూరగాయలు, ఆహార ధాన్యాల ధరలపై ఎందుకు కనిపించడం లేదని, వ్యాపారుల దోపిడీని అడ్డుకునేది ఎవరంటూ లాహోర్ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు