Nalgonda: నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండల కేంద్రంలోని క్రషర్ మిల్ సమీప గుట్టల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. సగం కాలిన స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన క్రషర్ మిల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పక్కనే ఇంజెక్షన్ నీడల్, పాక్షికంగా కాలిన దుస్తులు లభించాయి. దీంతో సదరు వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఎవరైనా దారుణంగా హత్య చేసి ఆధారాలు లభించకుండా దహనం చేసేందుకు యత్నించారా? అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు, మృతుడి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు