Hyderabad: దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించనున్న జనగణనలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలను కూడా లెక్కించాలని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఓబీసీ కులగణనపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వి. హనుమంతరావుతో పాటు ప్రొఫెసర్ కంచె ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరై ఓబీసీ కులగణన ఆవశ్యకతను వివరించారు. జనగణనలో ఎస్సీ, ఎస్టీల వివరాలతో పాటు ఓబీసీల జనాభాను కూడా నమోదు చేయాలని వి. హనుమంతరావు కోరారు. ఓబీసీల సంఖ్యపై స్పష్టమైన గణాంకాలు తేలినప్పుడే దేశవ్యాప్తంగా ఆ వర్గానికి న్యాయం చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ఓబీసీలను లెక్కించకుండా సెన్సస్ ప్రక్రియ చేపడితే ఆ ప్రక్రియను బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓబీసీ కులగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు త్వరలో తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంశంలో అన్ని వర్గాలు ఐక్యంగా ఉండాలని వి. హనుమంతరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్తో పాటు వివిధ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు