Kaizer News

SIR పై ఈసీకి సీఎం రేవంత్ లేఖ

SIR పై ఈసీకి సీఎం రేవంత్ లేఖ

· City - Hyderabad · prabhanews.com

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఓటు హక్కును కాపాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఆయన కీలక సూచనలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారు పొరపాటున తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్రంలో 73.39 లక్షల నమోదులను గైర్హాజరు, శాశ్వతంగా తరలిపోయినవారు, మరణించినవారు, నకిలీ నమోదుల విభాగాల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటిలో 45.19 లక్షల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా గుర్తించినట్లు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కుకు ఎలాంటి భంగం కలగకూడదని స్పష్టం చేశారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకునే గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితాలను గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాల్లో బహిరంగంగా చదివి వినిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు స్పందించేందుకు మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఓటరు నమోదు లేదా ధృవీకరణ కోసం అంగీకరించే పత్రాల జాబితాను స్పష్టంగా ప్రకటించాలని సూచించారు. అవసరానికి అనుగుణంగా ఓటరు నమోదు అధికారుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. “ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకూడదు” అన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు హక్కు పరిరక్షణ కోసం ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా పారదర్శకంగా, సమగ్రంగా ఓటరు జాబితా సవరణ చేపట్టాలని కోరారు

Original source: prabhanews.com
Read more on Kaizer News