నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదల్లో కనీసం 579 మంది మృతి చెందగా 977 మంది గల్లంతైనట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. హిమానీనదం నుంచి మంచు కొండ విరిగిపడిన ఘోర విపత్తులో టిబెట్ లో ఐదుగురు మరణించారని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొనడంతో మొత్తం మృతుల సంఖ్య 584కి చేరింది. దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు రెండు దేశాల ప్రభుత్వాలు నిర్థారించాయి. 14,000 మందికి పైగా భద్రతా సిబ్బంది పగలూ రాత్రి శ్రమించి ఇప్పటిదాకా 3,742 మందిని రక్షించారు. వరదలు నేపాల్, టిబెట్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. అయితే, ఈ రెండు దేశాల నుంచి వస్తున్న సమాచారంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఖాట్మాండు నుంచి వస్తున్న నివేదికలు నేపాల్లోని విధ్వంసంపై వాస్తవాలు చెబుతుంటే టిబెట్ నుంచి వచ్చే సమాచారంపై చైనా గట్టి నియంత్రణ పెట్టినట్టు తెలుస్తోంది. దీని వల్ల అక్కడి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. నేపాల్–టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదల కారణంగా 320 మంది భారతీయులు గల్లంతు కాగా మరో 400 మంది చైనా వైపు చిక్కుకుపోయారు. వీరిలో కొంతమంది క్షేమంగానే ఉన్నట్లు సమాచారం అందిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం ప్రకటించింది. చైనా వైపు చిక్కుకుపోయిన 96 మంది భారతీయులు రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా నేపాల్కు చేరుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. త్రిశూల్ వన్ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న దాదాపు 63 మంది భారతీయులు సురక్షితంగానే ఉన్నారని అన్నారు. శుక్రవారం 21 మంది తమిళనాడు వాసులు ఢిల్లీకి చేరుకున్నట్లు చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్వాగతం పలికారు. ఆ 21 మంది కైలాస మానసరోవర్ యాత్ర వెళ్లి వరదల్లో చిక్కుకోవడంతో నేపాల్ సైన్యం రక్షించింది. నేపాల్లో గల్లంతైన మిగిలిన భారతీయుల ఆచూకీని గుర్తించాలని ఎస్. జైశంకర్ నేపాల్ విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసారు. ఈ అంశం పై ఎస్. జైశంకర్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బాధితులను తరలించడానికి హెలికాప్టర్లను ఉపయోగించడంతో పాటు సహాయక బృందాలు నదీ తీరాలు, నివాస ప్రాంతాల్లో గాలింపును కొనసాగిస్తున్నాయి. అయితే ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపర్చడానికి తగినంత స్థలం లేకపోవడం సమస్యగా మారింది. విపత్తు సహాయ నిధికి తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా, మంత్రివర్గ సభ్యులు నిర్ణయించారు. ఈ సంక్షోభ సమయంలో నేపాల్ కు సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలియచేస్తూ ప్రధాని మోదీ నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్ లో మాట్లాడారు. వరదలతో అతలాకుతలమైన నేపాల్కు 67 టన్నుల సహాయక సామగ్రిని పంపాలని భారత్ సిద్ధం చేసింది. మూడో విడత కింద 10 టన్నుల సహాయక సామగ్రిని, 11 మంది వైద్యులను, పారామెడిక్ సిబ్బందిని భారత్ శుక్రవారం పంపింది. సామగ్రిలో జనరేటర్ సెట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి టాబ్లెట్లు ఉన్నట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక, రక్షణ చర్యలకు భారత్ తన మద్దతు ఇస్తుందని అన్నారు. బుధవారం