Kaizer News

Russia vs Ukraine | ర‌ష్యా చ‌మురుశుద్ధి క‌ర్మాగారం

Russia vs Ukraine | ర‌ష్యా చ‌మురుశుద్ధి క‌ర్మాగారంపై డ్రోన్‌ల‌తో విరుచుకుప‌డ్డ ఉక్రెయిన్‌..!

· National - India · ntnews.com

Russia vs Ukraine : రష్యా (Russia) లోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ (Ukraine) డ్రోన్‌ల‌ (Drones) తో విరుచుకుపడింది. కిరిషి ప్రాంతంలోని ఒక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్‌ దాడి చేయడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గతంలో ఇదే కర్మాగారాన్ని కీవ్‌ తీవ్రంగా దెబ్బతీయడంతో మాస్కో తిరిగి పునరుద్ధరించింది. మరికొద్ది రోజుల్లో కర్మాగారంలో పనులు తిరిగి ప్రారంభం అవ్వాల్సి ఉండగా ఈ దాడి జరగడం గమనార్హం. రోజుకు నాలుగు ల‌క్ష‌ల‌ బ్యారెళ్ల సామర్థ్యంగల ఈ ప్లాంట్ డీజిల్, గ్యాసోలిన్, ఫ్యూయల్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన దాదాపు 494 డ్రోన్లను విజయవంతంగా కూల్చేసినట్లు రష్యా వెల్లడించింది. ఈ నెలలో 20కి పైగా రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు చేసినట్లు పేర్కొన్న‌ది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌కు సరఫరాను కొనసాగించడానికి.. డీజిల్ ఎగుమతులపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దాడులకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. వరుస దాడులు కొనసాగుతుండడంతో రష్యాలో గ్యాసోలిన్ కొరత ఏర్పడింది. మరోవైపు శనివారం తెల్లవారుజామున కీవ్‌పై మాస్కో దాడి చేయడంతో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గిడ్డంగిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పేలుడు పరికరాలను గుర్తించి, నిర్వీర్యం చేయడానికి పైరోటెక్నిక్ బృందాలు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News