ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: నేపాల్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో నిర్వహించిన ‘నేపాల్కు సంఘీభావం’ కార్యక్రమంలో సద్గురు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిలో చోటుచేసుకునే ఘటనలకు దైవిక కారణాలను వెతకడం కంటే.. వాటి వెనుక ఉన్న భౌతిక కారణాలను అర్థం చేసుకోవాలని సూచించారు. నేపాల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సద్గురు.. ‘‘గత 20 ఏళ్లుగా నేపాల్ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతి ఏటా నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను’’ అని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. అవి ఎందుకు జరిగాయనే దానికి కారణాలను, తత్వాలను అల్లుకుంటూ ఆధ్యాత్మిక కోణాలను వెతికే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే ప్రకృతిలో జరిగే ఘటనలు భౌతిక నియమాల ప్రకారమే జరుగుతాయని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ దీనికి ఒక దైవిక కారణాన్ని కనుగొనాలని కోరుకుంటారు. కానీ అలాంటి విషయాలపై మన సమయాన్ని వృథా చేసుకోకూడదు. దైవత్వం అనేది మరో అంశం. భౌతిక దృగ్విషయాలు భౌతిక నియమాలచేతనే పాలించబడతాయి’’ అని సద్గురు స్పష్టం చేశారు