చేవెళ్ల: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలను, 1000 రోజుల పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) పిలుపు మేరకు సమరశంఖం పూరిస్తున్నట్లు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంత్ రెడ్డి, జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణా రెడ్డిలతో పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ: "అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 1000 రోజులు గడిచినా ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ ఆందోళన కార్యక్రమాలను చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలి. ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ 'బాకీ కార్డుల' రూపంలో వైఫల్యాలను ప్రజలకు వివరించి, నిరసన తెలపాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు నాయకులు సమన్వయంతో పనిచేసి, సెప్టెంబర్ 2 నుండి 9 వరకు జరిగే ఈ నిరసనల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి" అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండలాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనపై నాయకులతో చర్చించి, దిశానిర్దేశం చేశారు