ఈ ఖిచ్డీని ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంగా లేదా సాయంత్రం తేలికపాటి భోజనంగా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా వేడి వేడి ఖిచ్డీకి పెరుగు, పుల్లటి ఖట్టా లేదా ఉల్లి-టమాటా సలాడ్ జత చేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతోనే హైదరాబాదీ రుచిని ఆస్వాదించవచ్చు. ముందుగా బియ్యం, పప్పును బాగా కడిగి సుమారు 15–20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి.ప్రెషర్ కుక్కర్లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర, బే ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. తర్వాత టమాటా, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి టమాటా మెత్తబడే వరకు ఉడికించాలి. నానబెట్టిన బియ్యం, పప్పును వేసి మసాలాతో కలిసి రెండు నిమిషాలు వేయించాలి. అనంతరం 4–5 కప్పుల నీరు పోసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై 4–5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ సహజంగా తగ్గిన తర్వాత మూత తీసి ఖిచ్డీని బాగా కలపాలి. ఖిచ్డీ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీటిని కలిపి మళ్లీ వేడి చేయవచ్చు. చివర్లో ఒక చెంచా నెయ్యి, తరిగిన కొత్తిమీర వేస్తే మంచి సువాసన వస్తుంది. హైదరాబాదీ స్టైల్లో అయితే వేడి ఖిచ్డీని ఖట్టా, చిక్కటి పెరుగు లేదా ఉల్లి-టమాటా సలాడ్తో వడ్డిస్తే అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది