కాట్మాండు: టిబెట్ బోర్డర్లో ఉన్న గిరాంగ్ కౌంటీతో పాటు నేపాల్లో వరదలు విలయం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే చైనాలోని జిజాంగ్ ఆటోనమస్ ప్రాంతంలో ఉన్న పర్వతాలను ఓ టూరిస్టు తన కెమెరాతో షూట్ చేస్తున్న సమయంలో.. యాదృచ్చికంగా మంచు కొండ కూలిన(Glacier Collapse) దృశ్యాలు చిక్కాయి. అయితే ఆ దృశ్యాల్లో ఉన్నది.. ప్రస్తుతం నేపాల్లో విలయానికి కారణమైన ప్రాంతమే అని చైనా అంచనా వేసింది. హై ఆల్టిట్యూడ్లో ఉన్న గ్లేసియర్ కూలిపోవడం వల్లే భీకరమైన బురదతో కూడిన వరద గిరాంగ్ పోర్టును తుడిచిపెట్టేసిందని చైనా పేర్కొన్నది. చైనాలోని జినువా న్యూస్ రిపోర్టు ప్రకారం.. వీడియోలో ఉన్న లొకేషన్, రిమోట్ సెన్సింగ్ ఇమేజ్లు రిలీజ్ చేసిన ప్రాంతాలు ఒక్కటిగా ఉన్నట్లు చైనీస్ ఎన్విరాన్మెంట్ అకాడమీ డైరెక్టర్ కాంగ్ సిచాంగ్ తెలిపారు. అయితే నేపాల్ వైపున్న మంచుకొండ కుప్పకూలినట్లు ఫూటేజ్ ద్వారా స్పష్టం అవుతున్నట్లు చైనీస్ మీడియా పేర్కొన్నది. మంచుకొండ కూలి, సరస్సులో పడడం, ఆ తర్వాత రాళ్లు, బురుద ప్రవాహం .. జల ప్రళయాన్ని సృష్టించినట్లు చైనా మీడియా తమ రిపోర్టులో వెల్లడించింది. కొండచరియ విరిగిపడడం వల్ల భారీ స్థాయిలో మంచు ఫలకం, రాళ్లు, బురద.. కొండ లోయల్లో .. ఓ శక్తివంతమైన ప్రవాహంలా మారింది. అది చైనా బోర్డర్లోని గిరాంగ్ పోర్టును ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అయితే సుమారు 5140 మీటర్ల ఎత్తులో ఉన్న మంచుకొండ(గ్లేసియర్) కూలినట్లు చైనీస్ మీడియాలో తెలిపారు. సుమారు 6,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఆ మంచు, రాళ్లు, బురద సుమారు 20 కిలోమీటర్లు దిగువకు ప్రవహించి, సముద్ర మట్టానికి 3300 మీటర్ల ఎత్తులో ఉన్న గిరాంగ్ పోర్టును నేలమట్టం చేసినట్లు చైనా మీడియా పేర్కొన్నది. అయితే ఈ ప్రక్రియ మొత్తం కేవలం ఏడు నిమిషాల్లోనే ముగిసినట్లు ఆ కథనంలో తెలిపారు