Nepal Floods: నేపాల్ నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలోని ఉన్న ఒక పాఠశాల నిమిషాల వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో 1,643 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉదయం 9:20 గంటల సమయంలో ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీకి ఓ స్నేహితుడి నుంచి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. ఎగువన ఉన్న గ్రామం కొట్టుకుపోయిందని, వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ఆ స్నేహితుడు హెచ్చరించాడు. మొదట్లో నదికి 60 మీటర్ల ఎత్తులో ఉన్న మూడు అంతస్తుల కాంక్రీట్ భవనం సురక్షితమేనని ప్రిన్సిపాల్ దవాడీ భావించినా, నిమిషాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. వెంటనే స్పందించిన ఆయన ఆలస్యం చేయకుండా పాఠశాల గంట మోగించి, ఉపాధ్యాయుల సహాయంతో తరగతులను ఖాళీ చేయించారు. మార్గమధ్యంలో ఉన్న బస్సులను వెనక్కి మళ్లించగా, అప్పటికే వంతెన దాటుతున్న ఒక బస్సును మాత్రం ఆపలేకపోయారు. భయంతో స్పృహతప్పి పడిపోయిన ఓ విద్యార్థినిని వెంటనే బైక్పై సురక్షిత ప్రాంతానికి తరలించగా, మిగిలిన పిల్లలందరినీ కొండపైకి పరుగులు తీయించారు. అందరికంటే చివర్లో నడుస్తూ ఏ ఒక్క చిన్నారి వెనుకబడిపోకుండా దవాడీ పర్యవేక్షించారు