Kaizer News

Nandini Sidhareddy | కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కా

Nandini Sidhareddy | కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నందిని సిధారెడ్డికి లండన్‌ టాక్ నాయకుల ఘన సన్మానం

· International · ntnews.com

హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్, ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి ( Nandini Sidhareddy) ని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు . టాక్ (Telangana Association of United Kingdom) సంస్థకు చీఫ్ అడ్వైజర్లుగా నందిని సిధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. లండన్‌లో టాక్ సంస్థ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరైనప్పటి నుంచి సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను నిశితంగా గమనిస్తున్నామని నందిని సిధారెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంతో పాటు, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ టాక్ సంస్థ తన లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, పూర్వ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు రత్నాకర్ కడుదులతో పాటు కార్యవర్గ సభ్యుల కృషిని ప్రత్యేకంగా అభినందించారు. సంస్థలను ఏర్పాటు చేయడం మాత్రమే గొప్ప విషయం కాదని, వాటిని స్థిరంగా కొనసాగిస్తూ దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి రచించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ‘అనిమేష’ కవితా సంపుటితో పాటు ఇతర పుస్తకాలను టాక్ సభ్యులకు బహూకరించారు. తెలంగాణ ఎఫ్డీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు . టాక్ కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌పర్సన్ గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యురాలు జాహ్నవి దూసరి మాట్లాడుతూ నందిని సిధారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవ్య కుప్పాల, నాయకులు తిరుమందాస్ నరేష్ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్ బత్తిని పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News