నేపాల్లో 675 దాటిన మృతుల సంఖ్య ∙2,426 మంది జాడ గల్లంతు వరద ‘సరస్సు’ఉప్పొంగుతుండటంతో పొంచి ఉన్న కొత్త ముప్పు విపత్కర పరిస్థితుల్లోనూ అలుపెరగక శ్రమిస్తున్న ఆర్మీ, పోలీసులు, వలంటీర్లు జలవిద్యుత్ కేంద్రం సొరంగం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ భారత్చేస్తున్న సాయానికి కృతజ్ఞత తెలిపిన నేపాల్ అధ్యక్షుడు కఠ్మాండు: మెరుపులా వచ్చి పడిన వరద బురద విలయంలో పారిపోయేందుకు క్షణమైనా సమయంలేక జల సమాధి అయిన అభాగ్యుల సంఖ్య అమాంతం పెరిగింది. నేపాల్–టిబెట్ సరిహద్దు మంచుకొండల నుంచి ముంచుకొచ్చిన జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య శనివారానికి ఏకంగా 675 దాటింది. 320 మంది విదేశీయులుసహా 2,426 మందికిపైగా జనం జాడ తెలీడంలేదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 183 మంది భారతీయులున్నారు. టిబెట్ వైపు ఏడుగురు చనిపోగా 554 మంది జాడ తెలీడంలేదని చైనా పేర్కొంది. భోటె కోశీ నదీపరీవాహక ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదిలో అంతకంతకూ పెరుగుతున్న నీటి మట్టాలు మళ్లీ స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వర్షం, బురద, చీకటిని సైతం లెక్కచేయకుండా బాధితులను కాపాడాలనే ఏకైక సంకల్పంతో 15 వేల మందికిపైగా సైనికులు అవిశ్రాంతంగా అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తుండటంతో వందలాది మందిని భవన శిథిలాలు, బురద మేటల నుంచి కాపాడగలిగారు. అడవుల్లో తలదాచుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను అందించారు. కాపాడిన వాళ్లను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు టిబెట్లోని ఛోచెన్ నది, పురెఫు నదుల సంగమం వద్ద ఏర్పడిన వరద సరస్సులో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయిలో కొనసాగడంతో మరోమారు జలఖడ్గం దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో దిగువ నేపాల్వాసుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. సరస్సులో నీటి రంగు మారుతోందని, ఈ లెక్కన ఏ క్షణంలోనైనా కట్ట తెంచుకుని భారీస్థాయిలో నీరు కిందకు ఉగ్రరూపంలో ప్రవహించవచ్చని నేపాల్ ప్రభుత్వాన్ని చైనా అప్రమత్తంచేసింది. సరస్సు కట్టుతెంచుకుంటే సెకన్కు 500 ఘనపు మీటర్ల నీరు మెరుపువేగంతో కిందకు దూసుకొచ్చి ప్రళయం సృష్టిస్తుందని అధికారులు హెచ్చరించారు. దిగువ ప్రాంతాల వాళ్లు తాత్కాలికంగా ఎగువ అడవిలోకి వెళ్లి తలదాచుకోవాలని సూచించారు. తమ వారిని కోల్పోయి ఇల్లు, వాహనాలు, సామగ్రి కొట్టుకుపోవడంతో పలువురు జీవచ్ఛవాలుగా మారిపోయిన హృదయవిదారక దృశ్యాలు పలు చోట్ల దర్శనమిచ్చాయి. వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 2,465 మందిని రక్షించారు. వీరిలో 113 మంది భారతీయులు సహా మొత్తంగా 163 మంది విదేశీయులు ఉన్నారు. టిబెట్లోని గ్యిరోంగ్ కౌంటీలో 1,000 మందిని కాపాడారు. 8జిల్లాల్లో ఇప్పటిదాకా 669 మృతదేహాలు లభ్యమయ్యాయి. రంగంలోకి భారత సొరంగ బృందం రాసువాలోని త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రాన్ని బురదమట్టి సగానికిపైగా కప్పేయడంతో లోపల చిక్కుకున్న దాదాపు 100 మంది సిబ్బందిని కాపాడేందుకు, రంధ్రం పెట్టేందుకు డ్రిల్లింగ్ యంత్రాలతో భారతీయ నిపుణులు రంగంలోకి దూకారు. భారత్లో సొరంగ సంబంధ సమస్యల్ని పరిష్కరించే 14 మందితో కూడిన నిపుణుల బృందాన్ని రప్పించారు. ఉత్తరాఖండ్లో మూడేళ్ల క్రితం సిల్క్యారా–బార్కోట్ సొరంగం క