Kaizer News

హిందూత్వం అంటే నిజమైన అర్థం ఇదే: న్యూయార్క్ లో మోహ

హిందూత్వం అంటే నిజమైన అర్థం ఇదే: న్యూయార్క్ లో మోహన్ భగవత్ సంచలన ప్రసంగం

· National - India · telugu.oneindia.com

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్‌ ఎస్‌ ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం న్యూయార్క్‌ లోని ప్రతిష్టాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌ లో సుమారు 5,000 మందితో జరిగిన సభలో మోహన్ భగవత్ ప్రసంగించారు. యూనివర్సల్ వన్ నెస్ సెలబ్రేషన్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమాన్ని 'అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌ మెంట్ అండ్ డైలాగ్' (AHEAD) సంస్థ నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ మతాల మధ్య ఐక్యత, సామరస్యం ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సమాజంలో మతాలు కేవలం ఆచారాలకే పరిమితం అయ్యాయి.. అయితే మతం అసలు ఉద్దేశం మనిషిని సత్యం వైపు నడిపించడమేనని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఆచారాలు కూడా అవసరమేనని తెలిపారు. మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటిచెప్పే సంప్రదాయం ఉన్న సమాజంలో తాను పనిచేస్తున్నానని అన్నారు. ఇక హిందూత్వం గురించి మాట్లాడుతూ.. భారత్ లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా అనుకుంటే.. అతడు అసలు హిందువే కాదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ ధర్మం ఎప్పుడూ అందరినీ కలుపుకుపోతుందే తప్ప ఎవరినీ దూరం చేసుకోదని అన్నారు. ఇక ఈ కార్యక్రమాన్నిఅమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌ మెంట్ అండ్ డైలాగ్ సంస్థ చారిత్రాత్మక రక్షా బంధన్ సమావేశం గా అభివర్ణించింది. మరోవైపు న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో మోహన్ భగవత్ పోస్టర్ అక్కడి బిల్ బోర్డుపై దర్శనమిచ్చింది. ఇక ఈ కార్యక్రమం స్థానిక సమయానికి మధ్యాహ్నం 2 గంటల నుండి 5.30 గంటల వరకు జరుగుతుండగా.. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, సంగీత, కళా ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి. ఈ కార్యక్రమాన్ని సమాజాల మధ్య.. దేశాల మధ్య ఐక్యతను జరుపుకునే ఉత్సవంగా నిర్వచించనున్నారు. ఇక 200 లకుపైగా హిందూ అమెరికన్ సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి. అంతకుముందు ఆర్‌ ఎస్‌ ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్‌ లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నిరాశ్రయులకు స్వయంగా ఆహారాన్ని అందిస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ప్రసంగిస్తూ.. ప్రస్తుతం ప్రపంచంలో పెరుగుతున్న విభేదాలు, ఘర్షణలను రూపుమాపి అందరినీ ఏకం చేసే అద్భుత శక్తి ఒక్క కృష్ణ చైతన్యానికి మాత్రమే ఉందని ఉద్ఘాటించారు. మనుషుల మధ్య ఎన్ని తేడాలు ఉన్నా.. అంతిమంగా అంతా కృష్ణమయం అనే భావన ప్రతి ఒక్కరి హృదయంలో నిండినప్పుడే ప్రపంచం స్వర్గధామంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News