ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నరోడా ప్రాంతంలోని ఓ ఎండుద్రాక్ష ఉత్పత్తుల తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అధికారుల వివరాల ప్రకారం నరోడా జీఐడీసీ ఫేజ్-3లోని ప్లాట్ నంబర్ 28లో శనివారం ఉదయం సుమారు 9.40 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలను అదుపు చేసేందుకు జీఐడీసీ, నికోల్, నరోడా, చాంద్ఖేడా, షాహ్పూర్ ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలానికి తరలించారు. అదనంగా నికోల్ నుంచి నీటి ట్యాంకర్ను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది