అప్పన్నపేటలో జిల్లా స్థాయి యోగా పోటీలు పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలం అప్పన్నపేటలోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఆరే సంతోష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. పురుషోత్తం, పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జరీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ నాగండ్ల, సర్పంచ్ ఆరే సంతోష్ మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణను అందించే జీవన విధానమని అన్నారు. చిన్ననాటి నుంచే యోగాను అలవాటు చేసుకుంటే విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఎదుగుతారని తెలిపారు. యోగా ద్వారా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే అసోసియేషన్ లక్ష్యమని వారు పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన మొదటి, రెండో, మూడో స్థానాల విద్యార్థులు సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అసోసియేషన్ తరఫున ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతర్ల సాగర్, సంయుక్త కార్యదర్శి దొడ్డే అవినాష్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు గుంటి రామకృష్ణ, వ్యాయామ దర్శకుడు డాక్టర్ వేల్పుల సురేందర్, ప్రాంతీయ నిర్వాహకుడు బొల్ల మల్లేష్, ఋషి యోగా సంస్థ వ్యవస్థాపకురాలు సునీత, నిర్వాహకులు రాజశేఖర్, ప్రశాంత్, ఆనంద్ కిషోర్, వ్యాయామ ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్, భగీందర్, ఇర్ఫాన్, యశ్వంత్, శ్యామల, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు